శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యాదవులదే కీలకపాత్ర అని, సదర్ ను రాష్ట్రపండుగగా గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కి కృతజ్ణతలు అని అఖిల భారత యాదవ మహాసభ నూతన అధ్యక్షుడు రవీంద్రనాథ్ యాదవ్ అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యాదవులు కీలక పాత్ర పోషించారని అన్నారు. ఇటీవల జైపూర్ లో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించడంతోపాటు టీచర్, గ్రాడ్యూయెట్ ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల సీట్ల కేటాయింపుల్లో యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ణప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల్లో ఉన్న యాదవుల అభివృద్ధి, సంక్షేమం కోసం తగిన కృషి చేస్తానని అన్నారు. అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వపన్ కుమార్ ఘోష్, కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్, జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎస్ సోం ప్రకాష్ యాదవ్ , జాతీయ ఉపాధ్యక్షుడు సత్య ప్రకాష్ సింగ్ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి , దక్షిణ భారత ఇంచార్జ్ ఆర్. లక్ష్మణ్ యాదవ్ , నియామక పత్రాన్ని విడుదల చేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి బల్బీర్ సింగ్ యాదవ్ లకు కృతజ్ణతలు తెలిపారు. అలాగే.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా అధ్యక్షులకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ణతలు తెలిపారు.

జాతీయ న్యాయకత్వం తనపై నమ్మకం ఉంచి, గురుతర రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తన తండ్రి చింతల లక్ష్మణ్ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభకు చేసిన సేవలే స్ఫూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ సంఘం అభివృద్ధికి కృషి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది చెప్పారు. అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులుగా, కోకపేట్ శ్రీ కృష్ణ యాదవ్ భవాన్ ట్రస్ట్ ఛైర్మన్ గా పనిచేసిన అనుభవంతో యాదవుల అభివృద్ధి కోసం మరింత సమర్దవంతంగా పని చేస్తానని అన్నారు. అలాగే దశాబ్ది కాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తోపాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన జాతీయ సంరక్షకులు బద్దుల బాబురావు యాదవ్ వంటి అనుభవజ్ఞులతో పనిచేయడం ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి యాదవులందరిని సంఘటిత పరిచి.. వారి సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని విభాగాలను కలుపుకొని.. పునః పరిశీలించి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తానని ఆయన తెలిపారు. కులగణన జరిగేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో చర్చించి తగిన కార్యాచరణ రూపొందించి, తనవంతు కృషి చేస్తామన్నారు. అదేవిధంగా సదర్ పండగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.