నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలను శేరిలింగంపల్లి బిజెపి నాయకులు గురువారం కలిశారు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లోనే కోవిడ్ ట్రీట్మెంట్ అంధించాలని వారిని కోరారు. కోవిడ్ వైద్యానికి అధికంగా చార్జీలు వసూలు చేయకుండా, కోవిడ్ పేషంట్లకు పూర్తి స్థాయిలో వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలోనే హఫీజ్పేట్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు శ్రీధర్రావు ఆద్వర్యంలో మాదినగూడ ప్రాణమ్ ప్రైవేట్ హాస్పిటల్ ఎండీ మనీష్ గౌర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇవాళ కోవిడ్ వ్యాధి ఒక పెను తుఫాన్ లా మారి జన జీవితాలను అల్లకల్లోలం చేస్తోందని అన్నారు. ఈ సమాజానికి మానవతా దృక్పథంతో కూడిన వైద్య సేవలు ఎంతో అవసరం అని అన్నారు. కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించి వైద్యులు మానవరూపంలో ఉన్న దేవుళ్లు అనే ఆర్యోక్తిని నిజం చేయాలని కోరారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫీజులు వసూలు చేయాలని, కరోనా బాధితుల అవసరాల్ని ఆసరాగా తీసుకొని ఇష్టారితిగా వ్యవహరించవద్దని అన్నారు. కరోనా వల్ల అసలే మానసిక ఆందోళనలో ఉన్న రోగిని వారి బంధువులను ఫీజుల పేరిట మరింత భయబ్రాంతులకు గురిచేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రవి గౌడ్, వర ప్రసాద్, కోటేశ్వరరావు, లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
