చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): అధికార పార్టీ బంద్ కు పిలుపు ఇస్తే రక్షణగా నిలబడి సహకరించిన పోలీసులు ప్రజాసమస్యలపై పిలుపునిస్తే ఉక్కు పాదం మోపాలని చూడడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిదికాదని బీజేపీ రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. పే రివిజన్ కమిషన్, రెండు లక్షల ఉద్యోగాలు, టీచర్స్, లెక్చరర్స్ కు గౌరవ వేతనం వెంటనే అమలు చేయాలని కోరుతూ తెలంగాణ బీజేపీ జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ధర్నాకు బయల్దేరిన కసిరెడ్డి భాస్కర్ రెడ్డిని చందానగర్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనను విడిచి పెట్టారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరదీయడం శోచనీయమన్నారు. పోలీసుల ముందస్తు అరెస్టులను తీవ్రంగా ఖండించారు. కసిరెడ్డి భాస్కరరెడ్డి, అజిత్ కుమార్ సేనాపతి, నందనం విష్ణుదత్ లను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు.

మేడ్చల్లో…
టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లకు మద్దతుగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆ పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్, వివేకానంద నగర్ డివిజన్ బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
