మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద మ్యాన్ హోల్స్ పూడిక తీసే నూతన ఆటో యంత్రాలను జోనల్ కమిషనర్ రవి కిరణ్, జలమండలి జీఎం రాజశేఖర్, ప్రాజెక్ట్స్ ఎస్ఈ వెంకటరమణతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ డ్రైనేజీలను శుభ్రపరిచే క్రమంలో భాగంగా మ్యాన్ హోల్స్ పూడికతీతకు ఉపయోగించే మానవ రహిత ఆటో యంత్రాలను ప్రారంభించడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రమాద రహిత, మానవ రహిత యంత్రాల ద్వారా 30 నుండి 40 మీటర్ల లోతు మ్యాన్ హోల్స్ ను పూడికతీత తీయవచ్చని అన్నారు.

అన్ని డివిజన్ లలో ఈ యంత్రాలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. ఈ యంత్రాల ద్వారా మ్యాన్ హోల్స్ను పూడికతీత చేయడం వలన సమయం ఆదా అవుతుందని అన్నారు. గతంలో మ్యాన్ హోల్స్ శుభ్రం చేసే క్రమంలో పారిశ్యుధ్య కార్మికులు మృత్యువాత పడేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, వాటర్ వర్క్స్ డీజీఎం నాగప్రియ, ఏఎంవోహెచ్ రవి కుమార్ పాల్గొన్నారు.
