శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలలో నెలకొన్న పలు సమస్యలపై కాంగ్రెస్ నాయకుడు మిరియాల ప్రీతమ్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) కార్యాలయాన్ని సందర్శించి అదనపు కమిషనర్ లక్ష్మీకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సురక్షిత రాకపోకల కోసం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలపై ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు పూర్తిగా పనిచేయడం లేదని తెలిపారు. దీని వల్ల వృద్ధులు, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రత్యేకంగా దీప్తిశ్రీ నగర్ కాలనీ ప్రవేశ ద్వారం ( క్రోమా షోరూం ఎదురుగా), చందానగర్ పీజేఆర్ ఎంక్లేవ్ ప్రవేశ ద్వారం (జిఎస్ఎమ్ మాల్ ఎదురుగా) వద్ద ఉన్న బ్రిడ్జిల వద్ద సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. లిఫ్టులు ఉన్నప్పటికీ అవి పరిమిత సంఖ్యలో ఉండటంతో రద్దీ సమయాల్లో కొంత అసౌకర్యం కలుగుతోందని, కొన్ని సందర్భాల్లో అవి పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. మరమ్మత్తులు కొంచెం త్వరగా జరిగితే ప్రజలకు మరింత సౌలభ్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల వల్ల కొంతమంది పాదచారులు రోడ్డు మీదుగా వెళ్లాల్సి వస్తోందని, భద్రత దృష్ట్యా ఈ సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఎస్కలేటర్ల మరమ్మత్తులు, లిఫ్టుల నిర్వహణను క్రమం తప్పకుండా చేపట్టి, ఫిర్యాదులపై వేగవంతంగా స్పందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.






