శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఉమ్మడి మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. మయూరి నగర్ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్లతో పాటు ఇతర అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని అధికారులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. కాలనీలో స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని శ్రీకాంత్ పేర్కొన్నారు. డివిజన్ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మయూరి నగర్ కాలనీ అధ్యక్షుడు కె.వి. రామరాజు, కిషోర్, రమణా రెడ్డి, చౌల, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.





