శేరిలింగంపల్లి, ఏప్రిల్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్ పల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన 27 అడుగుల గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని కూకట్ పల్లి వీధులలో విగ్రహాల మహా ఊరేగింపును రామనామ స్మరణతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల జయ జయధ్వానాలు, మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాలు, వేద మంత్రోచ్చారణల నడుమ నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి పారవశ్యాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు దంపతులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






