గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి చిన్న పెద్ద చెరువు ఔట్ లెట్ ను GHMC, ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. అలాగే ఖాజాగూడా వద్ద ముంపుకు గురైన ప్రాంతాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల వల్ల చిన్న పెద్ద చెరువు నిండిపోయి చెరువు కట్ట నుండి జాలువారిన నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతంలోని మంజీరా డైమండ్ హైట్స్ సెల్లార్లలోకి వచ్చిందని అన్నారు. నీరు ప్రవహించే ప్రదేశంలో జేసీబీ సహాయంతో ఇసుక బస్తాలు వేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం జరిగిందని అన్నారు.

అదేవిధంగా కిందికి నీరు రాకుండా అధికారుల సమక్షంలో పకడ్బందీ ప్రణాళికతో ఇసుక బస్తాలు వేయడం జరిగిందని తెలిపారు. వాతావరణ శాఖ రెండు రోజులు భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు ఈఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాస్, ఏఈ కృష్ణ వేణి, ఇరిగేషన్ ఏఈ శేషగిరి, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ తెరాస అధ్యక్షుడు రాజు నాయక్, వార్డ్ మెంబర్ నరేష్, జగదీష్, సత్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.






