వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్లో బీజేపీకి లభిస్తున్న ఆదరణను చూసి తెరాస నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బుధవారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉప్పల విద్యాకల్పన ఏకాంత్ గౌడ్కు మద్దతుగా నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.



ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి తెరాస అరాచక పాలనకు అంతం పలకాలన్నారు. జీహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. తెరాస, మజ్లిస్ కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఆరున్నర ఏళ్లుగా తెరాస ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధుల వివరాలను పాలకులు లెక్క చూపించాలన్నారు. ప్రజలు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు రవికుమార్ యాదవ్, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.