గచ్చిబౌలి, అక్టోబర్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని శేరిలింగంపల్లి శాసన సభ్యుడు ఆరెకపూడి గాంధీని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని వివేకానందనగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి సహకరించాలని, డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరారు.

అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని, డివిజన్ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరచాలని ఎమ్మెల్యే గాంధీని వినతి పత్రం ద్వారా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరారు. దీనికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, త్వరలోనే డివిజన్ లో పర్యటిస్తానని, గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షుడు జలేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు శేఖర్, ప్రసాద్, సుమన్, ప్రకాశ్, రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.