శేరిలింగంపల్లి, మార్చి 20 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటే ముఖ సౌందర్యం ఎన్నో రెట్లు పెరుగుతుందని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యుడు డాక్టర్ C శరత్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆశ్రి సొసైటీ అనాథ పిల్లలకు ఉచిత డెంటల్ చెక్ అప్స్, వారికి అవసరమైన వైద్య సేవలను అందించడం జరిగిందన్నారు. వారి సమక్షంలో కేక్ కట్ చేసి వారికి గిఫ్ట్స్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ KM రాధాకృష్ణ, ప్లేబాక్ సింగర్ అఖిల్ చంద్ర హాజరయ్యారు.
అనంతరం ముఖ్య అతిధి రాధాకృష్ణ మాట్లాడుతూ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని పెద్దలు అంటారని, కానీ నోరు మంచిది అయితే మన ఆరోగ్యం కూడా మంచిది అవుతుంది అని అన్నారు. తమకు దేవుడు ఇచ్చిన వరం గాత్రం అని, తమ నోరు, దంతాలను ఎంత బాగా చూసుకుంటే తాము అంతగా స్వరాలను పలికించగలం అని అన్నారు. నోటి శుభ్రత బాగుంటే మన మాటల్లో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయని అన్నారు. అనంతరం డాక్టర్ C శరత్ బాబు మాట్లాడుతూ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 20న జరుపుకుంటారన్నారు. నోటి పరిశుభ్రత, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించడం ఈ రోజును జరుపుకోవడం ప్రధాన ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ శ్రీకాంత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.