శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ KMR ఎస్టేట్ కాలనీ లో పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ కాలనీలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా KMR ఎస్టేట్స్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో నిత్యం డ్రైనేజి పొంగి పొర్లుతుంది అని , ఔట్ లెట్ సరిగ్గా లేక రోడ్ల పై ప్రవహిస్తుంది అని , డ్రైనేజి సమస్య తీవ్రమైనది అని, ఔట్ లెట్ సమస్య ను పరిష్కరించి, డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరించాలని, సీసీ రోడ్లు వేయాలని, మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపరచాలని PAC చైర్మన్ గాంధీ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ KMR ఎస్టేట్ కాలనీ లో నెలకొన్న డ్రైనేజి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని, మ్యాన్ హోల్ నుండి మ్యాన్ హోల్ వరకు పూడిక తీసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఔట్ లెట్ సమస్య ను త్వరితగతిన పరిష్కరించాలని జలమండలి అధికారులకు సూచించారు. అవసరమున్న చోట మ్యాన్ హోల్స్ పునరుద్ధరించాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, త్వరలోనే సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






