శేరిలింగంపల్లి, జనవరి 30 (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుందని శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ సంవత్సరపు జిహెచ్ఎంసి నిధులను అన్ని శాఖల సమన్వయంతో పనులు చేపట్టాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు . గురువారం ప్రవేశపెట్టిన గ్రేటర్ హైదరాబాద్ బడ్జెట్ సమావేశంలో నిధుల కేటాయింపుపై ప్రతి అంశంపై క్లుప్తంగా మాట్లాడి శేరిలింగంపల్లి అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని నగర మేయర్ ని జగదీశ్వర్ గౌడ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సమస్యల పరిష్కారానికి, సీసీ రోడ్డు, ఇతర మౌళిక వసతుల సమస్యలపై అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ప్రజలు కష్టపడి సంపాదించిన స్థలంలో ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోతుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నాలాల అభివృద్ధి పనులు చేపట్టాలని, దళారులు,టౌన్ ప్లానింగ్ సిబంది ప్రజలను ఎంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఆర్పీ, సమైక్య మహిళ గ్రూప్ అభివృద్ధి కొరకు రూ.17 కోట్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. రోడ్లు, బ్రిడ్జి, సీ.ఆర్.ఎం.పి, ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిధులు మంజూరు చేయాలని, నూతన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు సంతోషకరమని, మరిన్ని స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని, వాటి మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్కులను అభివృద్ధి చేయాలని, కేటాయించిన నిధులు సక్రమంగా అమలు చేసి శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని అనేక పార్కులను అభివృద్ధి చేసి వాటి పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో అనేక డివిజన్ కాలనీలలో ప్రజలు నూతన పోల్స్, స్ట్రీట్ లైట్లు, కేబుల్ నిర్మించాలని అడుగుతున్నారని, వెంటనే ఆ పనులు చేపట్టేలా చూడాలని, అధికారులు మాత్రం పోల్ ఉంటే లైట్లు లేవని, లైట్లు ఉంటే కేబుల్ లేదు అని చెప్పడం జరుగుతుందని, కనుక నిధులు సక్రమంగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టాక్స్ అస్సెస్మెంట్ చేయడం ద్వారా జి.హెచ్.ఎం.సి కి నిధులు సమకూర్చుకునే అవకాశం ఉంటుందని, తద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గోకుల్ ప్లాట్స్, అయ్యప్ప సొసైటీ, సర్వే నెంబర్ 80, పాపి రెడ్డి కాలనీ ఇలా అనేక కాలనీ, బస్తి ప్రజలు అక్కడ నివాసం ఉండే ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అన్ని చర్యలు అధికారులు చేపట్టాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని జగదీశ్వర్ గౌడ్ కోరారు.