శేరిలింగంపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలుస్తారని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. తెలంగాణ తొలి రాజు, బహుజన రాజ్యాధికారి, పోరాట యోధుడు, మొగులయి దౌర్జన్యాలను ఎదిరించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆది శ్రీనివాస్, శంకర్ తో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందని, కుల, మతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కాలనే సమ సమాజ ప్రజాస్వామిక స్ఫూర్తితో ఆనాటి కాలంలోనే పాపన్నగౌడ్ పోరాడడం గొప్ప విషయమన్నారు.. విశ్వకీర్తిని పొందిన పాపన్న గొప్పతనాన్ని స్మరించుకునేందుకు ప్రతి ఏటా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. తెలంగాణ స్వయం పాలనలో సబ్బండ వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లభించిందని, స్వరాష్ట్రంలో వేలాది మంది దళిత, బహుజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడం ద్వారా పాపన్నగౌడ్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రంలో అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ గౌస్, శేఖర్ ముదిరాజ్, గిరి తదితరులు పాల్గొన్నారు.