శేరిలింగంపల్లి, జూన్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, సూపరింటెండింగ్ ఇంజనీర్, డిప్యూటీ కమిషనర్లతో కలిసి బుధవారం జోన్ పరిధిలోని ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద, సంతోష్ ధాబా సమీపంలోని నీటి నిల్వ ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసిన అధికారులు, నీటి నిల్వకు కారణమైన సమస్యలను గుర్తించి డ్రైనేజీ వ్యవస్థ పనితీరును సమీక్షించారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, వర్షపు నీటి పారుదల మెరుగుపడేలా తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ సృజన సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సౌకర్యం, రహదారులపై నీటి నిల్వ నివారణకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.






