చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): డిసెంబర్ 1న జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికలలో తెరాస అభ్యర్థులను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీ, అపర్ణ కమ్యూనిటీ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో డివిజన్ తెరాస అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు తెరాస అభ్యర్థులకు బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. తెరాసకు అపూర్వ ఆదరణ లభిస్తుందన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే ఈసారి తెరాస అభ్యర్థులకు వారు బంపర్ మెజారిటీని ఇస్తారని ఖాయంగా కనిస్తుందన్నారు. చందానగర్ డివిజన్ ప్రజలు మంజుల రఘునాథ్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, వెంకటేశం, రామచంద్రారెడ్డి, గోవింద్ రెడ్డి, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

డివిజన్లో బైక్ ర్యాలీ…
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చందానగర్ లో డివిజన్ తెరాస అభ్యర్థి మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.