శేరిలింగంపల్లి, మార్చి 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఇండియా ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని అపర్ణ హిల్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకునే వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. నీటి ప్రాముఖ్యతను ప్రజలకు వివరించేందుకు ర్యాలీలు, సదస్సులు, చర్చా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టారు. నీరు జీవానికి ఆధారం అనే నినాదంతో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని నీటి సంరక్షణపై తమ బాధ్యతను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ భవిష్యత్తు తరాలకు తగిన నీటి వనరులు అందించాలంటే ఇప్పటి నుంచే సంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, నీటి వృథా నియంత్రణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

అపర్ణ హిల్ పార్క్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా తాగునీటి కొరత రోజురోజుకీ పెరుగుతోందని, భవిష్యత్తులో నీరు అత్యంత విలువైన వనరుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పట్టణాల్లో భూగర్భ జలాల తగ్గుదల, గ్రామీణ ప్రాంతాల్లో నీటి కొరత వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వాలు నీటి సంరక్షణకు పలు పథకాలు అమలు చేస్తున్నప్పటికీ, ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా నీటి వృథాను తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ఇండియా అధ్యక్షుడు ఎం. నరేంద్ర, కార్యదర్శి టి. కిరణ్, జాయింట్ సెక్రటరీ టీ. నాగరాజు, ఈసీ సభ్యులు శ్రవణ్, మన్మధ రెడ్డి, అనిల్ రెడ్డి, రంగనాథ్ మాట్లాడుతూ ప్రతి చుక్క నీరు అమూల్యం, దాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.






