శేరిలింగంపల్లి, జూలై 5 (నమస్తే శేరిలింగంపల్లి): భారత స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి అని ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర పోరాటంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి ఆ పోరాటంలోనే ప్రాణాలర్పించిన మన్యం విప్లవ వీరుడని అన్నారు. ఆ మహనీయుడి128 వ జయంతిని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ఉషముళ్లపూడి కమాన్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, కార్పొరేటర్ నార్నె శ్రీకాంత్ లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ భారత దేశ స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. మన్యం ప్రజలలో విప్లవ బీజాలు నాటి ప్రజలను చైతన్య పరిచి స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా చైతన్య పరిచిన మహానుభావుడు అల్లూరి అని కొనియాడారు. భారత దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడు అని, అల్లూరి సీతారామరాజు 22 ఏళ్ల చిన్న వయసుల్లోనే మన్యం ప్రజలను కలుపుకుని బ్రిటీషు పాలనను ఎదిరించిన గొప్ప యోధుడని అన్నారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ యూత్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.