నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని చందానగర్ సర్వేనెంబర్ 281 లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుందని పలుమార్లు రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని టీఆర్ఎస్ నాయకులు మిద్దెల మల్లారెడ్డి వాపోయారు. సర్వే నంబర్ 281 లోని ఎకరా 19 గుంటల ప్రభుత్వ భూమిని పరిశీలించి సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని గత ఆరు సంవత్సరాల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నామని, గత రెండు నెలల క్రితం ఇదే విషయంపై మరోసారి ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ప్రజలు ప్రభుత్వ అధికారులను కార్యాలయంలో సందర్శించే వేళలు 3 గంటల నుంచి 5 గంటల వరకు తహశీల్దారు కార్యాలయంలో వేచి చూసినా తహశీల్దారు, ఆర్ఐ ఎవరూ అందుబాటులో లేకపోవడం విచారకరమని అన్నారు. కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండక, ఫిర్యాదులు చేసిన ప్రభుత్వ భూములను కాపాడలేని రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తహశీల్దారు కార్యాలయానికి వచ్చిన వారిలో మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, నిమ్మల శేఖర్ గౌడ్, శ్రీనివాస్, సందీప్, దిలీప్ పాల్గొన్నారు.