- హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఆచార్య మనోజ్ కుమార్
- భేల్ టౌన్షిప్ శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భేల్ టౌన్షిప్ లో గల శేరిలింగంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఆచార్య మనోజ్ కుమార్ విచ్చేసి సర్ సీ. వీ. రామన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా హైస్కూల్స్, కాలేజెస్, విశ్వవిద్యాలయాలలో జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనదేశంలోనే పుట్టి, మనదేశంలోనే చదివి, మనదేశంలోనే పరిశోధనలు ఆవిష్కరించి భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి సారిగా నోబెల్ ప్రైజ్ అందుకొని చరిత్ర సృష్టించిన గొప్ప పరిశోధకుడు సర్ సీ. వీ. రామన్ అని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఉండాలంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో మరింత పురోభివృద్ధి సాధించాలని, ప్రభుత్వాలు పరిశోధనా రంగానికి పెద్దపీట వేసి మరింత అధికంగా నిధులను కేటాయించి పరిశోధనలను ప్రోత్సహించాలని చెప్పారు. విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువులలో సైన్స్ రంగాన్ని ఎంచుకొని మంచి మంచి పరిశోధనలను ఆవిష్కరించి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఈ రంగంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. నిఖత్ అన్జుమ్, వైస్ ప్రిన్సిపాల్ సీ. జ్యోతి, అధ్యాపకులు డా. వరలక్ష్మి, జానయ్య, పి. మురళీకృష్ణ, బిక్షపతి, మోహన్, గోపాల్, శ్రీమతి సురేఖ, ఫరహత్ నజ్నీన్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, అమ్మయ్య చౌదరి విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
