శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఉద్యోగానికని వెళ్లిన ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా అదృశ్యం అయిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చందానగర్లోని ఆదర్శ్నగర్లో నివాసం ఉంటున్న ముల్క ప్రశాంత్ స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య రాణిత (32), కుమార్తె జ్యోతిక (10), కుమారుడు సుందర్ (8) ఉన్నారు. రాణిత స్థానికంగా ఉన్న ఓ సూపర్ మార్కెట్లో క్యాషియర్గా పనిచేస్తోంది. కాగా జూన్ 23వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో రాణిత తాను ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ కోసం ఆమె పనిచేస్తున్న చోట భర్త ప్రశాంత్ వాకబు చేయగా ఆమె అక్కడికి రాలేదని చెప్పారు. కాగా రాణిత స్థానికంగా ఉన్న కేఎస్సార్ మోడల్ స్కూల్కు వెళ్లి అందులో చదువుతున్న తన కుమార్తె, కుమారున్ని తీసుకుని వెళ్లిపోయిందని ప్రశాంత్కు సమాచారం అందింది. దీంతో వారి ఆచూకీ కోసం అతను తెలిసిన వారు, చుట్టు పక్కల, స్నేహితులు, బంధువుల వద్ద విచారించాడు. అయినా ఫలితం లేదు. దీంతో అతను చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాణిత ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు లైట్ బ్లూ కలర్ ఆఫ్ షర్ట్, నేవీ బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉందని, ఆమె 4.5 అడుగుల ఎత్తు ఉంటుందని, తెలుగు మాట్లాడుతుందని, ఎవరికైనా ఆచూకీ తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు సూచించారు.