శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 20 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మియాపూర్ పోలీసులకు లభ్యమైంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ మెట్రో పిల్లర్ నంబర్ 638 వద్ద ఓ వ్యక్తి మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలియలేదని, అతను ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అతని వయస్సు సుమారుగా 40 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని, వైట్ కలర్ టీషర్ట్, బ్లూ జీన్స్, బ్లాక్ స్వెటర్ను ధరించి ఉన్నాడని, చామన ఛాయ రంగులో ఉన్నాడని, ఎత్తు సుమారుగా 5.4 అడుగులు ఉంటాడని పోలీసులు తెలిపారు. అతని శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. అతని మృతికి కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఎవరైనా గుర్తు పట్టదలిస్తే మియాపూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.