- అధికారులకు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : చెరువులు శుభ్రతలో క్షేత్రస్థాయిలో సిబ్బంది మరింత శ్రద్ధగా పని చేయాలని సీనియర్ ఎంటమాలజీ సంధ్యకి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి సూచించారు. వ్యర్థాలను వెను వెంటనే తొలగించాలని, నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. చెరువులలో గుర్రపు డెక్క లేకుండా చూడాలని ఆదేశించారు. గోపన్ పల్లి ఫ్లైఓవర్ నీ పరిశీలించి పనులు వేగవంతం చేయాలని డీసీ రజినీకాంత్, అర్బన్ బయోడైవర్సిటీ మేనేజర్లనీ ఆదేశించారు.
అంతేకాక కొత్తగూడ కూడళ్లు, మస్జీద్ బండ, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలలో పర్యటించి పారిశుద్ధ్య పనులతో పాటు రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ కూడళ్ల నిర్వహణను మరింతగా మెరుగు పరచాలని, రహదారుల పక్కన ఇసుక మట్టి పేరుకొనకుండా ఎప్పటికపుడు శుభ్రం చేయాలని సూచించారు. సర్కిల్లో డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు పర్యవేక్షక అధికారులు రోజువారీ పారిశుద్ధ్య పనులను పరిశీలించాలని, ఎటువంటి లోటు ఉన్నా తక్షణ సవరణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
జడ్సీ వెంట 20వ సర్కిల్ డీసీ రజినీకాంత్, ఏఎంఓహెచ్ డాక్టర్. నాగేశ్, యూబీడీ మేనేజర్ విక్రమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.