శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపించే లక్ష్యంతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) చేపట్టిన వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా గాయత్రినగర్ వార్డులో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. కూకట్పల్లి జోన్, కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని గాయత్రినగర్ వార్డులో సీఎంసీ కమిషనర్ సృజన, సీనియర్ అధికారులు, స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల (RWA) ప్రతినిధులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కమిషనర్ స్థానిక ప్రజలు, RWA ప్రతినిధులతో సమావేశమై వార్డులో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్ల నిర్మాణం, సీవరేజ్, UGD పైప్లైన్లు, నాలా పనులు, వీధి దీపాలు, విద్యుత్ భద్రత, పారిశుద్ధ్యం, దోమల నివారణ, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ హాళ్లు, రహదారి అనుసంధానం తదితర అంశాలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా కైతలాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నెలకొంటున్న ట్రాఫిక్ రద్దీ, రాకపోకల సమస్యలపై కూడా చర్చించారు. ట్రాఫిక్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంతో పాటు స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ప్రజలు ప్రస్తావించిన సమస్యలను కమిషనర్ సమీక్షించి, అవసరమైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు సంబంధిత లైన్ డిపార్ట్మెంట్లు, ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని సకాలంలో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు, RWA ప్రతినిధులతో నేరుగా మమేకమై వార్డు స్థాయి అవసరాలను గుర్తించడం, పౌర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ప్రజా సేవలకు సంబంధించిన సమస్యలను సమన్వయంతో పరిష్కరించడమే లక్ష్యంగా వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమాన్ని సీఎంసీ కొనసాగిస్తోంది.





