శేరిలింగంపల్లి, ఆగస్టు 11 (నమస్తే శేరిలింగంపల్లి): నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్లోని శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ఆర్సీ పురం మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. వెజిటెబుల్ మార్కెట్ వ్యాపారస్తులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. మార్కెట్ అభివృద్ధితో పాటు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ఉపాధ్యక్షుడు ఖాజా పాషా, జనరల్ సెక్రటరీ అస్లాం, ట్రెజరర్ శ్రీనివాస్, మొయిస్, రాంచందర్, కృష్ణమూర్తి చారీ, ప్రవీణ్, శ్యామల రాజు, లాలా, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.





