శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (నమస్తే శేరిలింగంపల్లి): గోపన్పల్లి ఎన్టీఆర్నగర్లోని నియో శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్, కరస్పాండెంట్ ఉమ, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాళ్లు పసుపు, కుంకుమ, నైవేద్యాలతో సంప్రదాయబద్ధంగా బోనం సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించారు. అనంతరం తెలంగాణ పండుగల విశిష్టత, బోనాల పండుగ ప్రాధాన్యతపై విద్యార్థులు ప్రసంగిస్తూ సంస్కృతి పరిరక్షణ అవసరాన్ని వివరించారు.

సంప్రదాయ వేషధారణలో పోతురాజులుగా అలంకరించిన విద్యార్థులు చేసిన విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతి, ఆచారాలను భావితరాలకు చేరవేసేందుకు ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు కలిసి విందులో పాల్గొని బోనాల వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ముగించారు.





