శేరిలింగంపల్లి, ఆగస్టు 3 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి పరిధిలోని వెంకట్ రెడ్డి కాలనీలో అసంపూర్తిగా ఉన్న ఓపెన్ డ్రైనేజ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ కాలనీ వాసులతో కలిసి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నరేందర్ యాదవ్ మాట్లాడుతూ ఓపెన్ డ్రైనేజ్ కారణంగా కాలనీలో తీవ్ర దుర్వాసన వ్యాపిస్తోందని, పిల్లలు, వృద్ధులు, పాదచారులకు ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజ్ పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిని స్వీకరించిన జోనల్ కమిషనర్ సమస్యను పరిశీలించి, అత్యవసర ప్రాతిపదికన చర్యలు చేపట్టి డ్రైనేజ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.






