శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గంగారం గ్రామంలో మెట్రో రైల్వే ఫ్లైఓవర్, రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో పోచమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ శనివారం పరిశీలించారు. మెట్రో, రోడ్డు విస్తరణ పనుల కారణంగా గంగారం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ గోపురం దెబ్బతినే అవకాశం ఉందని, అలాగే పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని గ్రామస్తులు ఇటీవల రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి గ్రామంలో ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని, రామాలయం, ఆంజనేయస్వామి ఆలయ గోపురానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

గ్రామస్తుల అభ్యర్థన మేరకు రవికుమార్ యాదవ్ శనివారం గ్రామంలో పర్యటించి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామానికి అవసరమైన కమ్యూనిటీ హాల్ నిర్మాణంతోపాటు ఆలయాల పునర్నిర్మాణానికి కూడా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాల్ యాదవ్, దొంతి శేఖర్ ముదిరాజ్, రాజు, రామకృష్ణ గౌడ్, రాజేందర్, రవికుమార్, రాజు యాదవ్, అర్జున్, సాయి కిరణ్, రాజు శ్రావణ్ కుమార్, నరసింహ, ఎం. రాజు, భాస్కర్, స్వామి అశోక్ తదితరులు పాల్గొన్నారు.





