శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన కుత్బుల్లాపూర్ జోన్లోని జీడిమెట్ల సర్కిల్ పేట్బషీరాబాద్ వార్డును సందర్శించి పౌర సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్తో పాటు వివిధ శాఖల అధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. సత్యం ఎన్క్లేవ్ పార్క్లో నిర్వహించిన సమావేశంలో కాలనీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులు, స్థానికులతో కమిషనర్ నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ అవుట్లెట్, తాగునీటి సరఫరా, సర్వీస్ రోడ్డు విస్తరణ, మూసివేసిన రహదారిని తిరిగి ప్రారంభించడం, ఫుట్పాత్ ఆక్రమణలు, అక్రమ పార్కింగ్, అంతర్గత వీధుల్లో పారిశుధ్య నిర్వహణ వంటి సమస్యలను ప్రజలు ప్రస్తావించారు.

అలాగే పార్కు ఫెన్సింగ్, నిర్వహణ, అభివృద్ధి, వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలు, ఎన్సీఎల్ కాలనీలో ఆరోగ్య కేంద్రం, రేషన్ సదుపాయం, ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు, వుడ్స్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టాలని స్థానికులు కోరారు. ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిశీలించిన కమిషనర్.. ప్రాధాన్యత కలిగిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వన్ వార్డ్ ఎవ్రీ డే కార్యక్రమం ద్వారా వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, స్థానిక అవసరాలకు అనుగుణంగా వేగంగా పరిష్కార చర్యలు చేపట్టేందుకు అవకాశం కలుగుతోందని తెలిపారు.





