శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రహదారుల పరిశుభ్రతను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక మెకనైజ్డ్ రోడ్ స్వీపింగ్ సాంకేతికతల పైలట్ ప్రదర్శన నిర్వహించారు. కార్పొరేషన్ కమిషనర్ సృజన, అదనపు కమిషనర్ (పారిశుద్ధ్యం), కూకట్పల్లి జోనల్ కమిషనర్, మాదాపూర్ డిప్యూటీ కమిషనర్లతో కలిసి పర్వత్ నగర్లో ఏర్పాటు చేసిన యంత్రాల ప్రత్యక్ష ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా అంతర్గత రహదారులు, కాలనీల పరిశుభ్రత కోసం సెల్ఫ్-ప్రొపెల్డ్ స్వీపింగ్ మెషిన్, ప్రధాన రహదారులపై దుమ్ము, చెత్తను యాంత్రికంగా తొలగించే ట్రక్-మౌంటెడ్ వ్యాక్యూమ్ కమ్ స్వీపింగ్ మెషిన్, సేకరించిన వ్యర్థాల రవాణా కోసం ప్రత్యేక వ్యర్థాల సేకరణ వాహనం పనితీరును అధికారులు పరిశీలించారు.

పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన రెండు ప్రాంతాల్లో ఈ మెకనైజ్డ్ స్వీపింగ్ యంత్రాలను క్షేత్రస్థాయిలో వినియోగిస్తూ వాటి పనితీరు, సామర్థ్యం, ఉపయోగాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆధునిక మెకనైజ్డ్ సాంకేతికతలను వినియోగించడం ద్వారా రహదారుల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతోపాటు దుమ్ము కాలుష్యాన్ని తగ్గించి, పారిశుద్ధ్య సేవలను వేగవంతంగా, సమర్థవంతంగా అందించేందుకు ఈ పైలట్ అధ్యయనం దోహదపడుతుందని కమిషనర్ తెలిపారు.





