శేరిలింగంపల్లి, జూలై 4 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ డే, వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా కమిషనర్ పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, డిప్యూటీ కమిషనర్తోపాటు వివిధ శాఖల అధికారులతో కలిసి శేరిలింగంపల్లి జోన్లోని మియాపూర్ సర్కిల్ పరిధిలో ఉన్న దీప్తి శ్రీనగర్ వార్డును సీఎంసీ కమిషనర్ సృజన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నివాసితులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమైన కమిషనర్ వార్డు పరిధిలోని పౌర సమస్యలు, మౌలిక వసతుల అవసరాలపై సమీక్ష నిర్వహించారు.

స్థానికులు పార్కులు, ఓపెన్ జిమ్లు, బహిరంగ ప్రదేశాల అభివృద్ధి, రోడ్ల అనుసంధానం, పెండింగ్ రోడ్డు పనులు, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, డ్రైనేజీ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ల నిర్మాణం, పూడిక తొలగింపు, తాగునీటి సరఫరా, దోమల నియంత్రణ, సౌకర్య స్థలాలపై ఆక్రమణల తొలగింపు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుద్ధ్యం తదితర అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై స్పందించిన కమిషనర్, ఆరెకపూడి గాంధీ సంబంధిత శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి గుర్తించిన సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వార్డులో పౌర సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.





