శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): న్యూఢిల్లీ రాజ్యాంగ క్లబ్ లో రెడీ పట్రీ వ్యాపారుల మహాసంఘ్ అధ్యక్షుడు అలోక్ పాండే, ప్రధాన కార్యదర్శి అభిషేక్ నిగమ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జూన్ 30న జాతీయ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఎంపీ మనోజ్ తివారీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టు న్యాయవాదులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ హాకర్స్ అసోసియేషన్ (TSHA) రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ సంయుక్త కార్యదర్శి సీహెచ్ సతీష్ గౌడ్ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వ అధికారులు వీధి వ్యాపారులను బలవంతంగా తొలగించడం వల్ల వారి జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వీధి వ్యాపారుల హక్కులను పరిరక్షించే స్ట్రీట్ వెండర్స్ (ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండింగ్) చట్టం, 2014ను అన్ని రాష్ట్రాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వీధి వ్యాపారులకు చట్టబద్ధమైన రక్షణ కల్పించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.





