శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన్ డే – వన్ వార్డు కార్యక్రమంలో భాగంగా జూలై 4న ఉదయం 6:30 గంటలకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కమిషనర్ సృజన దీప్తిశ్రీనగర్ వార్డులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రీడం కమ్యూనిటీ పార్క్, కేఎస్ఆర్ ఎన్క్లేవ్ గణేష్ మండపం ప్రాంతాలను సందర్శించి, స్థానికంగా ఉన్న పౌర సౌకర్యాలు, పారిశుద్ధ్య పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత మున్సిపల్ అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారు. పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించే దిశగా అధికారులకు అవసరమైన సూచనలు చేయనున్నారు. ఈ మేరకు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు.





