శేరిలింగంపల్లి, మే 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూనగర్, గోపినగర్తోపాటు పలు ప్రాంతాల్లో నెలకొన్న ప్రజా సమస్యలపై మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాదయాత్ర నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులను పరిశీలిస్తూ, కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్థానికంగా గుర్తించిన సమస్యలను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక చొరవతో డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. డ్రైనేజీ నీరు నిత్యం పొంగిపొర్లుతున్న ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి అత్యవసర పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఓపెన్ నాలాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాటి స్థానంలో ఆర్సీసీ పైప్లైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

పనుల అమలులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. కాలనీలు, బస్తీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ సమస్యల రహిత ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, సీనియర్ నాయకులు యాదా గౌడ్, దాకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, శ్రీకాంత్ దేవులపల్లి, సయ్యద్ గఫర్, ఎల్లా దాస్, రాజ్ కుమార్, రమేష్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ చారి, ఉపేందర్, దస్తగిరి, వెంకటయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.





