శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ బూత్ స్థాయి సమావేశంలో బూత్ స్థాయి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీ అధికారంలోకి రావడానికి తీవ్రమైన కృషి చేశారని, దాన్ని మర్చిపోలేమని అన్నారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం, సమయం తక్కువ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల లక్ష పది వేలకు పైగా ఓట్లను సాధించామని అన్నారు.

బూత్ స్థాయిలో గత ఎన్నికలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుండి బలపర్చుకోవాలని, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఏ పార్టీలో అయినా కార్యకర్త చాలా ముఖ్య భూమిక పోషిస్తారని, కింది స్థాయిలో ప్రజల అవసరాలను, వారి సంక్షేమానికి కావలసిన మౌలిక వసతుల అవగాహన కార్యకర్తలకు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. 2028 సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.





