శేరిలింగంపల్లి, మే 10 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామంలో నాభిశిల (బొడ్రాయి) ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యవహచనం, రక్షాబంధనం, మూల మంత్ర హోమం, రుద్ర హోమం, 21 కలశాలతో అభిషేకం, అర్చన నైవేద్యం తీర్థప్రసాదాలు వితరణ చేశారు. గ్రామస్తులు గ్రామ నడిబొడ్డున బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో బోనాలను ఊరేగింపుగా బొడ్రాయి వద్దకు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సహస్ర ఘటాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. గ్రామస్తులు ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు సమృద్ధిగా పండేందుకు ఆశీర్వదించాలని పూజలు నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






