శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): ఆర్టీసీ కార్మికులు తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని హెచ్సీయూ, మియాపూర్ డిపోల ఎదుట గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు యూనియన్లను పునరుద్ధరించాలని, 2021, 2025 వేతన సవరణ, 2017 పీఆర్సీ బకాయిలు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సహా అన్ని సమస్యలను ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని అన్నారు. ఎన్నో ఏండ్లుగా ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్న కార్మికులను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వారి డిమాండ్లను పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు చేస్తున్న పోరాటానికి ఆర్టీసీ కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లేష్, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము, రాఘవేంద్ర, దరగయ్య, సుభాష్ గౌడ్, శ్రీనివాస్, రాజాబాబు పాల్గొన్నారు.





