శేరిలింగంపల్లి, ఏప్రిల్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కార్మిక యూనియన్లు ఇచ్చిన సమ్మె పిలుపులో భాగంగా హెచ్సీయూ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులతో కలిసి సిఐటియు శేరిలింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ, ఏఐటీయూసీ నాయకుడు రామకృష్ణ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, 30 శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని, వేతన సవరణ చేపట్టాలని, మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ప్రతి నెలా ఇవ్వాల్సిన రూ.400 కోట్లను వెంటనే జమ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేసి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని, ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారాలను తగ్గించాలని, ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి అప్పగించాలని, అద్దె బస్సులను, అద్దె బస్సు డ్రైవర్లను ఆర్టీసీలో విలీనం చేయాలని, మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






