శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నాయకులు తీవ్రంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందజేశారు. TRP రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి, జిల్లా మీడియా ఇంచార్జ్ ప్రశాంత్ నేత తదితరులు ప్రజావాణి, శేరిలింగంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదులను సమర్పించారు. మక్తా మహబూబ్పేట్ జనప్రియ వెస్ట్ సిటీ పరిధిలోని సర్వే నంబర్లు 12, 16, 17లో 2001 లో వెంచర్ వేసి సర్వే నంబర్ 44 లోని స్థలాన్ని కూడా ఆక్రమించి అనుమతులు లేకుండా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, అలాగే సంబంధిత సర్వే నంబర్ 44 హద్దులను గుర్తించి బౌండరీ ఫిక్స్ చేయాలని కోరారు. కాలనీలో సెల్లార్ అనుమతులు లేకుండా అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఈ భవనాలను తక్షణమే పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకుని సీజ్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా TRP నాయకులు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే అక్రమ నిర్మాణాలను అరికట్టాలని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల హక్కుల కోసం TRP ఎల్లప్పుడూ ముందుండి పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.






