శేరిలింగంపల్లి, ఏప్రిల్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని గౌతమ్ మోడల్ పాఠశాలను సీజ్ చేసి ఆ పాఠశాల యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా పల్లె మురళి మాట్లాడుతూ పలు మార్లు MEO కి ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. మదీనాగూడ మైత్రి నగర్ లోని గౌతమ్ మోడల్ స్కూల్ యాజమాన్యం ఫీజుల వేధింపుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, అనేకమంది విద్యార్థులు రెండు నెలల పాటు పాఠశాలలకు రాని పరిస్థితి నెలకొందని, తల్లిదండ్రులు కొన్ని రోజులు గడువు అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు. వారి చేష్టలకు ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తల బాదుకుంటున్న పరిస్థితి ఉందన్నారు. ప్రిన్సిపాల్ సంధ్య రాణి వ్యవహార శైలి తల్లిదండ్రుల పట్ల చాలా హేళనగా ఉందని, బంగారం తనఖా పెట్టి ఫీజులు కట్టాలని హుకుం జారీ చేస్తుందని ఆరోపించారు. అందువల్ల గౌతం మోడల్ స్కూల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






