శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 13 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రగతి నగర్లో ఉన్న అంబీర్ చెరువు సమగ్ర అభివృద్ధి కోసం లేక్ వ్యూ కాలనీ, ఆదిత్య నగర్ కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నివాసులు కలిసి సైబరాబాద్ కమిషనర్ సృజనకి వినతిపత్రం సమర్పించారు. స్థానికులు వివరించిన సమస్యలను కమిషనర్ శ్రద్ధగా ఆలకించి, అంబీర్ చెరువు అభివృద్ధి కోసం తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా, చెరువును స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంబీర్ లేక్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాంబశివరావు, లేక్ వ్యూ కాలనీ ప్రతినిధులు రామచంద్రరావు, ధనలక్ష్మి, గోవిందరాజు, ఆదిత్య నగర్ ప్రతినిధి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.






