శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): GHMC పరిధిలో ఇటీవల ప్రకటించిన డివిజన్ల పునర్విభజనలో నెలకొన్న సమస్యలు, పరిష్కరించాల్సిన చర్యలపై, వార్డుల పునర్విభజనలో మార్పులు , చేర్పుల గురించి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ RV కర్ణన్ లను GHMC ప్రధాన కార్యలయంలో ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, ఇతర కార్పొరేటర్లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం GHMC పరిధిలో 300 డివిజన్లను ఏర్పాటు చేయడం స్వాగతించాల్సిన విషయం అని, ప్రజలకు సుపరిపాలన, పరిపాలన సౌలభ్యం కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కానీ కొన్ని డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలను, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని, ప్రజల నుండి వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకొని ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా డివిజన్లను ఏర్పాటు చేయాలని, ప్రజల నుండి, కాలనీ వాసుల నుండి వచ్చే ప్రతి వినతులను పరిగణనలోకి తీసుకోవాలని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించి డివిజన్ల రూపకల్పన చేయాలని కోరారు.





