శేరిలింగంపల్లి, డిసెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): BHEL టౌన్ షిప్ లోని శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మానవహక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G రవీందర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి రాజనీతిశాస్త్ర విభాగపు అధిపతి ఆచార్య నాగేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవని అన్నారు. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి డిసెంబరు 10వ తేదీన ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందన్నారు. ఈ సంవత్సరం మానవహక్కులు – మన దైనందిన అవసరాలు అనే నినాదంతో నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి SV యూనివర్సిటీ ఆచార్య సోమరాజు, అధ్యాపకులు మహమ్మద్ యూనస్, సయ్యద్ మక్సూద్, విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, జనార్ధన్, పాలం శ్రీను, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.






