నమస్తే శేరిలింగంపల్లి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తిరుమల వేముల, చెరుకు సుధాకర్లను గెలిపించాలని పట్టభద్రులకు అఖిలభారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(ఏఐఎఫ్డీవై) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ ఒక ప్రకటనలో శుక్రవారం విజ్ఞప్తి చేశారు. వరంగల్,ఖమ్మం,నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్, హైదరాబాద్,రంగారెడ్డి, మహబూ బ్ నగర్ ఉమ్మడి జిల్లాల స్వతంత్ర అభ్యర్థి తిరుమల వేములకు ఏఐఎఫ్డీవై సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. నీళ్లు,నిధులు, నియామకాల ఆధారంగా అనేకమంది నిరుద్యోగ యువత, విద్యార్థుల బలిదానాల పై ఏర్పడిన తెలంగాణలో గత పాలకుల కన్నా ఎక్కువ స్థాయిలో అనిచివేత, దోపిడి పెరిగిందన్నారు.

గడిచిన ఏడు సంవత్సరాలలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరిగి దిక్కుతోచని స్థితిలో నిరుద్యోగులు ఉన్నారన్నారు. 50 వేల ఉద్యోగాల భర్తీ అని ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాల భర్తీ కాకపోవడం కేవలం ఎన్నికల కోసం చేసే బూటకపు వాగ్దానం అని తేలిందన్నారు. ఎన్నికల సమయంలో పాలకవర్గాలు ప్రజలకు మోసపూరితమైన వాగ్దానాలు చేస్తుంటారని ఇప్పటికైనా నిరుద్యోగ యువత, పట్టభద్రులు గమనించి పాలక వర్గ పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్, టిడిపీల అభ్యర్థులను ఈ ఎన్నికలలో తిరస్కరించాలని కోరారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్(బీఎల్ఎఫ్) బలపరిచిన తిరుమల వేముల, చెరుకు సుధాకర్లకు ఈ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి చట్టసభలకు పంపవలసిందిగా కోరారు.





