మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): దేశంలో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందేలా గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తోందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ శేరిలింగంపల్లి మహిళామోర్చా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు మియాపూర్లోని అతిథి హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా డి.కె.అరుణ, సినీనటి సిమ్రన్ చౌదరి, సినీ నిర్మాత శిల్పా చౌదరి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా డికె.అరుణ మాట్లాడుతూ మహిళాభివృద్ధి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు.

ముఖ్యంగా బేటీ బచావ్ – బేటీ పడావ్, ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, సైనిక దళాల్లోని మహిళా అధికారులకు శాశ్వత కమిషన్, స్టాండప్ స్కీం, ముద్ర లోన్, మహిళలకు 26 వారాల మెటర్నిటీ లీవ్, మహిళా రక్షణకు వన్ స్టాప్ సెంటర్లు, కమ్యూనిటీ టాయ్లెట్లు, ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి, పురుషుల తోడు లేకున్నా ముస్లిం మహిళలు హజ్ యాత్ర చేసే అవకాశం లాంటి ఎన్నెన్నో సదుపాయాలు, అవకాశాలు కల్పించేందుకు తగిన చట్టాలను ప్రవేశపెట్టిందని తెలియజేశారు. దేశంలోని ప్రతీ మహిళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వీణారెడ్డి , విద్యావేత్త – లయన్స్ క్లబ్ గవర్నర్ సురభి దుర్గావాణి, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ గీతా నాగశ్రీ గారు, అడ్వకేట్ వరలక్ష్మిగారు, ఎస్ఆర్ ట్రస్ట్కు చెందిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డి గారు, విద్యావేత్త శ్రీమతి విజయశ్రీ గారు, సామాజిక కార్యకర్త చందనా తేజ గారు, మిస్ యూనివర్స్ హిమజా నాయుడు లతో పాటు మహిళా మోర్చా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






