
హఫీజ్ పేట్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ ప్రభుత్వం అందించిన 10 వేల రూపాయల తక్షణ వరద సహాయం తమకు అందలేదంటూ హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని చందానగర్ శాంతినగర్ వాసులు ఆందోళన బాట పట్టారు. వరదల కారణంగా నష్టపోయిన తమకు న్యాయం చేయాలంటూ బస్తీకి చెందిన మహిళలు చందానగర్ నుండి పీజేఆర్ స్టేడియం వెళ్లే రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ వరదల కారణంగా తమ ఇండ్లు మునిగిపోయి తీవ్రంగా నష్టపోయామని, ఆర్థిక సహాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతూన్న కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా మంగళవారం ఉదయం సమీప బస్తీలలో కొద్దీ మందికి ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసి తమకు ఇవ్వకుండా వెళ్లిపోయారన్నారు. న్యాయంగా తమకు అందాల్సిన వరద సహాయాన్ని అధికారులు అందించేవరకు పోరాడుతామని తెలిపారు. విషయం తెలుసుకున్న చందానగర్ పోలీసులు డీఐ నర్సింగరావు నేతృత్వంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.






