
మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పిలుపు నిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా కరోనా వ్యాధిగ్రస్తుల కోసం అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి విరాళం అందజేసిన శేరిలింగంపల్లి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ను మంత్రి కేటీఆర్ తో పాటు ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ రావు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలు అభినందించారు. సోమవారం చంద్రశేఖర ప్రసాద్ అందజేసిన నిధులతో ఏర్పాటుచేసిన అంబులెన్సును మంత్రి చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా వ్యాధి గ్రస్తులకు సహాయం చేయాలని సదుద్దేశంతో కేటీఆర్ సంకల్పించిన ఈ కార్యక్రమానికి చంద్రశేఖర ప్రసాద్ సహాయాన్ని అందించడం సంతోషకరమన్నారు.

నేటి నుండి శేరిలింగంపల్లి ప్రాంతంలో అంబులెన్స్ సేవలు కొనసాగుతాయని రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా అంబులెన్స్ ను తీర్చిదిద్దారన్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వెంటిలేటర్ ను సైతం అంబులెన్స్ లో ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతరం చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి ప్రజలకు సేవ చేసుకునే అవకాశంగా భావించి అంబులెన్సు ఏర్పాటుకు తన వంతు సహాయాన్ని అందించానని తెలిపారు. కేటీఆర్ పిలుపునిచ్చే ప్రతి సేవా కార్యక్రమంలో తాను భాగస్వామ్యం అవుతానని అన్నారు.