నమస్తే శేరిలింగంపల్లి: ఆరోగ్య సంరక్షణలో మనిషి జీవనశైలి ప్రధానమైనదని, మంచి అలవాట్లను అలవరచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అన్నారు. బుధవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బిహెచ్ఇఎల్ ఎంఐజి కాలనీలో గల ఎస్ఓఎస్ అనాథాశ్రమంలో చిన్నారులకు స్మిత దంతవైద్యశాల వైద్యులు డా.శ్రీధర్రెడ్డి సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు, పేస్ట్లు, మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామియాదవ్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ఉన్న ప్రాముఖ్యతను మరియు ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజల్లో అవగాహన కల్పించటమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మన ఆరోగ్యం మన బాధ్యత అని, మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలని సూచించారు. క్రమం తప్పని వ్యాయామం , పౌష్టికాహారం, మానసిక ప్రశాంతతతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సరైన వైద్యం అందుబాటులో లేక లక్షలాదిమంది మృత్యువాత పడుతున్నారని, జీవితంలో ఏదైనా సాధించాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండటం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జనార్దన్ , నల్లగొర్ల శ్రీనివాసరావు , జిల్ మల్లేష్ ఆశ్రమ నిర్వాహకులు వికాస్ తదితరులు పాల్గొన్నారు.






