ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): తెరాస ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా తెరాస పార్టీలో చేరుతున్నారని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, ఎన్టీఆర్ నగర్ కి చెందిన పలువురు కాంగ్రెస్ మహిళా నాయకులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి గాంధీ తెరాస పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. తెరాసలో ప్రతి కార్యకర్తను గౌరవిస్తామని అన్నారు. అందరూ కలిసి బంగారు తెలంగాణను సాధించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి అండగా ఉండి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములమవుదామని అన్నారు. తెరాస ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ద్వారా పేదింటి ఆడపిల్లకు రూ.1,00,116 ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన మంజీరా నీరు అందిస్తున్నామన్నారు.

ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ వంటి అనేక గొప్ప సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో తెరాస పార్టీని నియోజకవర్గంలో మరింత బలపరుస్తామని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చేస్తూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ లో అందరినీ కలుపుకొని సమన్వయంతో పని చేస్తూ తెరాస పార్టీని పటిష్ట పర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుండి తెరాస పార్టీలోకి చేరిన మహిళలు నస్రీన్ బేగం, రజియా బేగం, అరుణ, నసీమ బేగం, హమీద, నసీమ బేగంలతోపాటు తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, దాసరి గోపి కృష్ణ, బ్రిక్ శ్రీను, కిషన్ తదితరులు పాల్గొన్నారు.