శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీని వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణ దారులకు మిడ్ ల్యాండ్ లిఫ్ట్ కు ఎన్నో సంవత్సరాలు భవన నిర్మాణ అనుమతులు ఇచ్చారని, కనుక అదే విధానాన్ని కొనసాగించాలని కోరారు. మిడ్ ల్యాండ్ లిఫ్ట్ తో భవన నిర్మాణాలు చేసిన వారికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కొత్త నిర్మాణాలకు టెంపరరీ సర్వీస్ కింద విద్యుత్ కనెక్షన్ ఇచ్చి అధిక మొత్తంలో డిపాజిట్లను వసూలు చేస్తున్నారని, అలాగే యూనిట్కురూ .11 బిల్లు వసూలు చేస్తారని అన్నారు. అంతకు ముందు కమర్షియల్ కింద పవర్ కనెక్షన్ ఇచ్చి యూనిట్కు రూ.5 వసూలు చేసేవారని, అదే విధానంలో బిల్లులను తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం నిర్మాణ దారులు విద్యుత్తు బిల్లులను చెల్లించే పరిస్థితిలో లేరని, పెట్టు బడులు మీద కనీస వడ్డీలు రాకపోయినా రాష్ట్రానికి, దేశానికి సంపదను సృష్టిస్తున్నారని, ఇలాంటి పరిస్థతుల్లో ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ఆయా సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బయ్య, వైస్ ప్రెసిడెంట్ కేవీ ప్రసాద్ రావు, కోశాధికారి లక్ష్మీ నారాయణ, బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధులు నరేంద్ర ప్రసాద్, రాజేంద్రప్రసాద్, కులదీప్, సుభాష్ బాబు, శివ లక్ష్మీ పతి రాజు పాల్గొన్నారు.